సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో శరద్ పవార్ నివాసంలో జరగనున్న విందు సమావేశంలో పాల్గోనున్నారు. సేవ్ నేషన్ పేరుతో ఢిల్లీ వేదికగా చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పొత్తులే ఎజెండాగా బాబు ఢిల్లీ టూర్ సాగనుంది. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు
రాహుల్ తో భేటీకానున్నారు. అనంతరం, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్తోనూ సమావేశంకానున్నారు.
ఢిల్లీ వేదికగా బీజేపీపై సమరశంఖం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగేశారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్నూ కూడా బీజేపీయేతర కూటమిలో భాగస్వామిని చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఢిల్లీ వేదికగా కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు చంద్రబాబు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. రాహుల్ గాంధీతోపాటు జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి వంటి సీపీఎం అగ్ర నాయకులతోనూ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తోనూ భేటీ అవుతారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో రాహుల్, చంద్రబాబు మొదటిసారి ఒకే వేదికపైకి కనిపించారు. ఇప్పుడు వారిద్దరూ ముఖాముఖి సమావేశం కానున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు ఢిల్లీ టూర్లో చంద్రబాబు ప్రాధాన్యమివ్వనున్నారు. ముఖ్యంగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లకు కాంగ్రెస్ పార్టీకి మధ్య కొన్ని సమస్యలున్నాయి. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీకీ, వామపక్షాలకు మధ్య విభేదాలున్నాయి. మొదట కలసి వచ్చే పార్టీల నాయకులందరితోనూ సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయా పార్టీల మధ్య ఉన్న విబేధాలను చక్కదిద్దడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత, ఈడీ, ఆదాయ పన్నుశాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిరసనగా పలు పార్టీల ఎంపీలతో కలసి వెళ్లి ఆయా విభాగాల అధినేతలకు వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలన్న చంద్రబాబు నిర్ణయానికి ఫరూక్ అబ్దుల్లా మొదటి నుంచీ అండగా నిలిచారు. శరద్ పవార్తో చంద్రబాబు భేటీకి ఆయనే కీలకపాత్ర పోషించారనే టీడీపీవర్గాలు అంటున్నాయి. చంద్రబాబు శరద్ పవార్ నివాసంలో జరిగే భేటీలో రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన ప్రణాళిక, దేశ రాజకీయాలపై చర్చిస్తారు. రాహుల్ గాంధీతో మధ్యాహ్నం మూడున్నర గంటలకు చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం అజిత్ సింగ్, సీతారాం ఏచూరి వంటి నాయకులను కలుస్తారు.