నిన్న(ఆదివారం) కొంగరకలాన్లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభ విజయవంతమైంది. సభకు చీమల దండులా జనం పోటెత్తారు. దీంతో టీఆరెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సభలో 49 నిమిషాల పాటుగా ప్రసంగించారు సీఎం కేసీఆర్. తన ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావించారు. అందరూ ఊహించినదాని కంటే భిన్నంగా సీఎం ప్రసంగం సాగింది. ముందస్తు ఆలోచనపై ఆచి తూచి మాట్లాడిన కేసీఆర్ తన మనసులో మాటను ఎక్కడా బయటపెట్టలేదు. కానీ, కేసీఆర్ మాట్లాడిన తీరు ముందస్తుపై రకరకాల ఊహాగానాలకు తెరతీసింది. భవిశ్యత్ లో ముందస్తుపై నిర్ణయం తీసుకుంటామన్న కేసీఆర్. సెప్టెంబర్ ఆరోతేదీన సభను రద్దు చేసే అవకాశముంది. అంటే సరిగ్గా మరో మూడురోజులకు సంచలన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబరు ఆరున లేదా 10లోపు అసెంబ్లీ రద్దు చేస్తేనే డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జరిగే కేబినెట్ భేటీ ఆఖరుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెండింగ్ ఫైళ్లపై మంత్రులు సంతకాలు పెడుతున్నట్టు తెలుస్తోంది.