ఆగ్రాలోని ఫతేబాద్లో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న కుక్కపై అధికారులు తారు రోడ్డు వేసి.. సజీవ సమాధి చేశారు. ఆదమరచి నిద్రిస్తున్న వీధికుక్కపై రోడ్డును వేయడం ఆగ్రహజ్వాలలకు దారి తీసింది. రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకున్న ఆర్పీ ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వర్కర్లు నిద్రిస్తున్న కుక్కపై తారును వేసి సజీవ సమాధిని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఫూల్ సయ్యద్ క్రాస్ నుంచి సర్క్యూట్ హౌజ్, తాజ్మహల్ల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోంది. కోల్తారును మరో రౌండ్ వేసేందుకు వచ్చిన కంపెనీ వర్కర్లు నిద్రిస్తున్న కుక్కను అక్కడి నుంచి లేపకుండా దానిపై సలసలకాగే తారును వేశారు. వేడి తారులో చిక్కుకున్న కుక్క.. తీవ్ర బాధతో ప్రాణాలను విడిచింది. రోడ్డు పని అంతా అయిపోయాక కుక్కను గమనించిన సిబ్బంది.. జేసీబీ సాయంతో తారు రోడ్డును తవ్వి.. కుక్కను బయటకు తీశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోడ్డు వేసిన కాంట్రాక్టర్, సిబ్బందిపై భగ్గమంటున్నారు. సామాజిక కార్యకర్తలు, జంతు ప్రేమికులు సదరు కాంట్రాక్ట్ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.