కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయ్. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ బిర్యానీ రుచులను టేస్ట్ చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ హెచ్చరించింది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో పర్యటించనుండటంతో టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పర్యటనలో భాగంగా రాహుల్ ఉస్మానియాలో విద్యార్థులతో సమావేశం కానున్నారు. తర్వాత రాజేంద్రనగర్లోని మహిళా సంఘాలతో భేటీ అవనున్నారు. టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్న వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ యువరాజు టూర్ సాగనుంది. అంతేకాకుండా మహేశ్వరం బస్సుయాత్ర సభలో రాహుల్ పాల్గొనే విధంగా టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ రుచులను టేస్ట్ చేయనున్నారు. 14వ తేదీన సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో బిర్యానీ రుచి చూడనున్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా బిర్యాని, ధమ్ కా చికెన్, కుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠాలు సిద్ధమని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్యారడైజ్లో లంచ్ చేసిన తర్వాత పాతబస్తీలోని ఇస్లామిక్ స్కాలర్స్తో సమావేశం కానున్నారు. రాత్రికి చారిత్రాత్మక మదీనా హోటల్లో డిన్నర్ చేయనున్నారు రాహుల్ గాంధీ.
మరోవైపు రాహుల్ గాంధీ పర్యటను అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ హెచ్చరించింది. రాహుల్కు ఏపీపై ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదన్న టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలు విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓయూలో రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.