సీఎం చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. ఏపీ పట్ల కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేకహోదా కావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ పోరాటాన్ని ఉదృతం చేసేలా ఆ పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్రం తీరుపై విమర్శలు చేశారు.
వైజాగ్ కు రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదన్న కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయిట్మెంట్ ను కోరారు . ఆయన అపాయిట్మెంట్ ఎప్పుడు ఇస్తారా..? తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని ఎంతగానో ఎదురు చూశారు. కానీ తెలుగు తమ్ముళ్లకు అపాయిట్మెంట్ ఇవ్వని పీయూష్ ..వైసీపీ ఎంపీలకు అపాయిట్మెంట్ ఇచ్చారు. వారి సమస్యల్ని విన్న కేంద్రమంత్రి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటే తమని పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కి అపాయిట్మెంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మిత్ర పక్షం తామా? లేక వైసీపీనా అనే సందేహం ప్రజలకు కలుగుతోందని అన్నారు.
అంతేకాదు కేంద్రం ఏపీకి న్యాయం చేసే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేంద్రం తీరును ఎండగడుతూ రాష్ట్రం తరుపున పోరాటం చేయాలంటూ తెలుగుతమ్ముళ్లకు సూచించారు. తొలత శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సమస్యలే ప్రతిధ్వనించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.