నల్లగొండ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. మిర్యాలగూడలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్య సంచలనం సృష్టించింది. తన భార్యను ఆస్పత్రిలో చూపించుకుని వెళ్తున్న ప్రణయ్ అనే వ్యక్తిని వెనుకనుంచి వచ్చిన దుండగుడు కత్తితో నరికేశాడు. ఇటు హత్య వెనుక ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. ఇద్దరు అమ్మాయిలతో వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి వెంటాడుతూ వచ్చిన దుండగుడు చేతిలో ఉన్న కత్తితో రెండు వేట్లు వేశాడు. అంతే ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ప్రణయ్తో వచ్చిన అమ్మాయిలు అరుపులు కేకలతో పరుగులు పెట్టారు.
వినోభానగర్కు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ 6 నెలల క్రితం అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అమృత తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్య అమృతను వైద్యలకు చూపించి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రణయ్ బంధువులు ఆందోళన చేపట్టారు. హత్యకు అమృత తండ్రి కారణమంటూ నినాదాలతో నిరసన చేపట్టారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రంగనాథ్ ఘటనా స్థలిని పరిశీలించారు. హత్యకు వాడిన తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. అమృత తండ్రి మిర్యాలగూడలో పేరుమోసిన రియల్టర్ అని అతనిపైనే ఆరోపణలున్నాయని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగిందంటున్న పోలీసులు దీని వెనుక ఎవరున్న వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
అప్పట్లో అమృత, ప్రణయ్ వివాహం సమయంలో కూడా ఇరు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చోటు చేసుకున్నాయి. అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమక్షంలో సమస్య సద్దుమణిగింది. ఈ మధ్యే రిసెప్షన్ ను కూడా గ్రాండ్గా నిర్వహించారు. అయితే తమకిష్టం లేని పెళ్లి చేసుకున్నారనే పగతోటే ఈ హత్య చేయించారని.. పరువు కోసం ప్రాణాలు తీశారనే ఆరోపణలు వస్తున్నాయి.