ఖమ్మంలో పవన్ నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశం గందరగోళంగా తయారైంది. ఫ్యాన్స్ పవన్తో ఫోటోలు దిగడానికి ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఎవరికి వారు ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో జనసేనాని ఏం చెబుతున్నారో ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. పవన్ స్పీచ్ పొడవునా అభిమానులు నినాదాలు, కేకలు, ఈలలతో హోరెత్తించడంతో.. జనసేనాని సందేశం కార్యకర్తలకు ఏమాత్రం చేరిందన్నది సందేహంగా మారింది. ఇక పవన్ సభ అనంతరం కూడా సభ ప్రాంగణం చిన్నపాటి కిష్కింధ కాండను తలపించింది. అభిమానులు నెట్టేసుకోవడం, తోసేసుకోవడంతో రచ్చ రచ్చగా మారింది. సమావేశం కోసం వేసిన కుర్చీలు గాల్లో ఎగిరి పడ్డాయి. జనసేన కార్యకర్తల అత్యుత్సాహంతో కుర్చీలను విరగొట్టారు. కాళ్లతో తొక్కి పడేశారు.