పాకిస్థాన్లో ఓ మంత్రి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన భార్యపై కాల్పులు జరిపి హత్య చేసి అనంతరం అదే తుపాకితో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీర్ హజార్ ఖాన్ అనే ఆ మంత్రి సింధ్ ప్రావిన్స్లో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన వ్యక్తి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి భార్య ఫరిహా రజాక్ను కాల్చి చంపిన మీర్ హజార్ ఖాన్.. తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశంలో దొరికిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్కు సంబంధించినవని పోలీసులు చెప్పారు. మంత్రి తలలో ఒక బుల్లెట్ ఉండగా.. ఆయన భార్య శరీరంలో మూడు బుల్లెట్లు లభించాయి. మంత్రి ఆత్మహత్య సింధ్ ప్రావిన్స్లో సంచలనం సృష్టించింది.