రామ మందిర నిర్మాణానికి చట్టం తిసుకురావలని కోరుతూ 500 జిల్లాల్లో భారీబహిరంగ సభలు నిర్వహించాలని అఖిల భారత సంత్ సమితి తీర్మానించింది. ఇందు కోసం ఈనెల 25 నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ముగిసిన సంత్ సమ్మేళనంలో అఖిలభారత సంత్ సమితి నిర్ణయం తీసుకుంది. కాగా రామ మందిర నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నప్పటికీ కొంత మంది కేంద్ర మంత్రులు మాత్రం బహిరంగంగానే పలురకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. గిరిరాజ్ సింగ్, ఉమాభారతిలకు ఇప్పుడు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే తోడయ్యారు. మందిర వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున, ఆలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రామ మందిర వివాదాన్ని తెరపైకి తెచ్చిందని సీపీఎం ఆరోపించింది. దేశ ఐక్యతను దెబ్బతీసే శక్తులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటోందని ఆ పార్టీ పొలిట్బ్యూరో విమర్శించింది.