వజ్రాల రాజధానిగా పేరొందిన గుజరాత్లోని సూరత్కు చెందిన ఆభరణాల తయారీదారులు తమ కళాకృతితో ప్రపంచ రికార్డు సాధించారు. 6,600లకు పైగా వజ్రాలు పొదిగిన చేతి ఉంగరంతో సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. విశాల్ అగర్వాల్, ఖుష్బు అగర్వాల్ అనే ఇద్దరు వజ్రాల వ్యాపారులు ఈ రికార్డును నెలకొల్పారు. కమలం ఆకారంలో ఉన్న ఓ ఉంగరంలో 6690 వజ్రాలు పొదిగి రికార్డును సొంతం చేసుకున్నారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ రింగ్లో 48 డైమండ్లతో పొదిగిన రేకులు ఉన్నాయి. ఈ ఉంగరం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.28 కోట్లు. 58 గ్రాముల బరువున్న ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టడం విశేషం.
ఈ సందర్భంగా ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకే ఇలా కమలం లాంటి ఆభరణాన్ని తయారుచేశామన్నారు. తామరపువ్వు మన జాతీయ పుష్పమే గాక.. నీటిలో పెరిగే అందమైన రూపమని, అందుకే దీన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు తమ ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసింది.