దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు...దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా కొండగట్టు ఘటన
డ్రైవర్ల నిర్లక్ష్యం.. ఓవర్ స్పీడ్...ఓవర్ లోడ్.. ఫిట్ నెస్ లేని బస్సులు..కారణం ఏదైనా..బలయ్యేది మాత్రం ప్రయాణికులే. కొండగట్టు విషాదం దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా మిగిలిపోయింది. ఆర్టీసీ చరిత్రలోనే మరువలేని చేదు జ్ఞాపకంగా మారింది. ఒక్క కొండగట్టే కాదు..దేశంలో జరిగిన ఎన్నో ప్రమాదాలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.
డ్రైవర్ల నిర్లక్ష్యం.. ఓవర్ స్పీడ్...ఓవర్ లోడ్.. పాత బస్సులు.. కారణం ఏదైనా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది డ్రైవర్ల నిర్లక్ష్యం సురక్షితం అనుకున్న ప్రయాణం గమ్యం చేరే వరకు టెన్షన్ పెడుతోంది దేశ వ్యాప్తంగా జరిగిన బస్సు ప్రమాదాలను చూస్తే డ్రైవర్లు ఏకగ్రత చూపకపోవడమనేది స్పష్టమవుతోంది.
బస్సు ప్రయాణం అంటేనే భయపడుతున్నారు ప్రయాణికులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్ల తొందరపాటు ఎన్నో బస్సు ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 54 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు లోయలో పడిపోవడంతో పిల్లలు, పెద్దవాళ్లు చనిపోయారు. దేశ చరిత్రలోనే జరిగిన ప్రమాదాల్లో కొండగట్టు బస్సు ప్రమాదం అతిపెద్దదిగా మిగిలిపోయింది. ఇంత వరకు ఇంత పెద్దమొత్తంలో ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం ఎక్కడా జరగలేదు.
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద 2013 అక్టోబర్ 30న ప్రైవేట్ వోల్వా బస్సు కారును ఓవర్ టేకింగ్ చేస్తూ కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో 45 మంది దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 2014లో జరిగిన బస్సు-రైలు ప్రమాదంలో 26 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయినవారంతా పది నుంచి పదిహేనేళ్లలోపు వారే. బస్సు పాఠశాలకు వెళ్తుండగా రైల్వే లెవలింగ్ క్రాస్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది.
ఉత్తర్ప్రదేశ్లో జూన్ 11న ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వద్ద బస్సు లోయలో పడి 51 మంది ప్రయాణికులు మరణించారు. 15మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. జమ్మూ కశ్మీర్లో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 370 మీటర్ల ఎత్తునుంచి చినాబ్ నదిలోకి పడిపోయింది. గుజరాత్లోని వడోదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ చరిత్రలో ఇది అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా గుర్తించారు.
మహారాష్ట్రాలో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మరణించారు. నాసిక్కు భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 39 మంది భక్తులు చనిపోగా 40 మంది గాయాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది భక్తులు మరణించారు. నేపాల్కి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఆలకనందా నదిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్లో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత వేగ నియంత్రణ బస్సుల ఫిట్ నెస్ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.