కూటమిలో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ జనసమితికి కేటాయించే సీట్లపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వకపోవడంతో తాము పోటీ చేయబోయే 12 స్థానాలను టీజేఎస్ సొంతంగా ప్రకటించుకుంది. అంతేకాదు ఈ 12 నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్కు ఛాన్సే లేదని టీజేఎస్ ఖరాఖండిగా తేల్చిచెప్పింది. పైగా తాము ప్రకటించుకున్న సీట్లే టీజేఎస్ అధికారిక జాబితా అంటూ ప్రకటించింది.
మహా కూటమిలో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. టీజేఎస్కు కేటాయించే సీట్లపై క్లారిటీ ఇవ్వాలంటూ కాంగ్రెస్కు అల్టిమేటం ఇచ్చిన తెలంగాణ జనసమితి చివరికి తాము పోటీ చేయబోయే 12 స్థానాలను సొంతంగా ప్రకటించుకుంది. దుబ్బాక, మెదక్, మల్కాజ్గిరి, అంబర్పేట్, సిద్దిపేట, వరంగల్ ఈస్ట్, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, మహబూబ్నగర్, మిర్యాలగూడ, వర్దన్నపేట, జనగామ నుంచి బరిలోకి దిగనున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ 12 స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చిచెప్పిన టీజేఎస్ ఈ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలన్నారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ జనసమితికి 8 స్థానాలు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే టీజేఎస్కి కేటాయించబోయే సీట్లపై స్పష్టత ఇవ్వడంలో జాప్యం జరిగింది. ఐదారు సీట్లపై కొంతవరకు క్లారిటీ ఇచ్చినా వాటిలో కొన్నింటిని టీజేఎస్ తిరస్కరించింది. దాంతో తమకిచ్చే సీట్లేంటో త్వరగా తేల్చాలని టీజేఎస్ అల్టిమేటం ఇచ్చింది. అయినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో తాము పోటీచేసే 12 స్థానాలను తెలంగాణ జనసమితి ప్రకటించుకుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించిన స్టేషన్ ఘన్పూర్, ఆసిఫాబాద్ల్లో కూడా పోటీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి కేటాయించిన మహబూబ్నగర్లో సైతం బరిలోకి దిగనున్నట్లు టీజేఎస్ ప్రకటించింది.
కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనలు పడుతోన్న జనగామను సైతం తెలంగాణ జనసమితి వదల్లేదు. జనగామను టీజేఎస్కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగానే, ఆ సీటును కూడా తెలంగాణ జనసమితి తన ఖాతాలో వేసేసుకుంది. కూటమిలోనే ఉన్నామంటూనే కాంగ్రెస్, టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లోనూ టీజేఎస్ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటించడంతో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చినట్లేనని భావిస్తున్నారు.