జగిత్యాలలో సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థుల మృతి కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని స్పష్టం చేశారు. వారివి హత్యలు కాదని, ఆత్మహత్యలని వెల్లడించారు. జగిత్యాల మిషన్ కాంపౌండ్లోని నిర్మాణుష్య ప్రదేశంలో రవితేజ, మహేందర్ ఇద్దరూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో మహేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రవితేజ మాత్రం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్పాట్లో దొరికిన సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల స్నేహితుల ఆత్మహత్యల వెనుక ఈ మధ్యే వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ.. ఆర్ ఎక్స్ హండ్రెడ్ కాన్సెప్ట్ ఉందని.. పోలీసుల విచారణలో తేలింది. మహేందర్ గతంలో ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ హీరోలా చనిపోతానంటూ చాలా సార్లు అన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. మహేందర్, రవితేజ ఇద్దరు వేర్వేరు బాలికలతో రోజూ చాటింగ్ చేస్తున్నారని. బాలికలతో చాటింగ్ విషయంపై తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోందని డీఎస్పీ వెంకట రమణ తెలిపారు. స్నేహితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ను పరిశీలిస్తున్నామని, కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.