అద్దె గర్భాల పేరుతో జరుగుతున్న వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం చెక్

Update: 2018-12-20 07:18 GMT

అద్దె గర్భాల పేరుతో జరుగుతున్న వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సెరోగసీ వ్యాపారాన్ని నిషేధిస్తూ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇక సమీప బంధువుల ద్వారానే అద్దె గర్భానికి అనుమతి లభిస్తుంది. ప్రవాస భారతీయులకు పర్మిషన్ లేదు. అద్దె గర్భాల పేరుతో వ్యాపారం జరుగుతోందని, దానికి భారత్‌ కేంద్రంగా మారిందని లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె గర్భాల పేరుతో జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిపారు. 

కేంద్ర మంత్రి నడ్డా అద్దె గర్భాల వ్యాపారం బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్న సమయంలో వివిధ అంశాలపై  ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని విలువైన సూచనలు చేశారు. మహిళలు, పిల్లల గౌరవంతో పాటు, కుటుంబాలను కాపాడడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా వివరించారు.

అద్దె గర్భాల వ్యాపార నిషేధ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత లోక్ సభ ఆమోదించింది. 2016లో రూపొందించిన ఈ బిల్లుకు 23 సవరణలు చేశామని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా తెలిపారు. అద్దె గర్భాల ప్రక్రియను ఎంచుకోవడానికి వివాహితులైన భార్యాభర్తలే అర్హులు. దంపతుల సన్నిహిత బంధువుల నుంచి అద్దె గర్భం పొందవచ్చు. ఆమె వివాహిత అయి ఉండాలి. కనీసం ఒక బిడ్డను కని ఉండాలి. అద్దె గర్భానికి  విదేశీయులు, ప్రవాస భారతీయులకు అనుమతి లేదు తదితర నిబంధనలు ఉన్నాయి. 

Similar News