జగిత్యాల జిల్లా కొండగట్టులో సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు ఉండగా.. నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్, ఆర్టీసీ డిపో నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కొండగట్టు ఘాట్రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. మరోవైపు ప్రమాదం గురించి మంత్రులను అడిగి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ప్రతిపక్షనేత కుందూరు జానారెడ్డి. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయన కోరారు.