కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సంపత్ కుమార్ లు 48గంటల పాటు గాంధీ భవన్ లో దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది.
నిన్న గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్రయత్నించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సభలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ సెట్ - ఇయర్ ఫోన్ లను గవర్నర్ పై విసిరేశారు. దీంతో ఆ హెడ్ సెట్ గాంధీజీ చిత్రపటానికి తాకి పక్కనే ఉన్న స్వామిగౌడ్ కంటికి తగలడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన మార్షల్స్ ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే స్వామిగౌడ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంది.
శాసన సభ ప్రారంభం కాగానే స్సీకర్ మధుసూదనాచారి నిన్నటి ఘటనను తీవ్రంగా ఖండించారు. చట్ట సభలో జరిగిన దాడి తీవ్ర విషయమన్నారు. ఇది క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. దాడికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. తర్వాత మంత్రి హరీష్ రావ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ను శాసన సభ నుంచి బహిష్కారించాలని, 11 మంది కాంగ్రెస్ సభ్యులను బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. హరీష్ ప్రవేశ పెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. వెంటనే సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని సభనుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. సస్పెండయిన వారిలో సీఎల్పీనేత జానారెడ్డి , ఉత్తమ్కుమార్ రెడ్డి, జీవన్రెడ్డి , చిన్నారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, పద్మావతి, వంశీచంద్, రామ్మోహన్రెడ్డి, మాధవ్ ఉన్నారు.
అయితే తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు 48 గంటల దీక్షకు దిగనున్నారు. ఇద్దరి శాసనభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేశారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీరి దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం దీక్ష ప్రారంభమవుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తొలుత దీక్షను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రారంభించాలనుకున్నప్పటికీ పోలీసులు అనుమతించరని భావించి, గాంధీ భవన్ లో దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. సభ్యుల సస్పెన్షన్, శాసనసభ్యత్వాల రద్దుపై రేపు కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించాలని నిశ్చయించింది.