నేడు ప్రకటించిన తెరాస అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు లేకపోవడంతో అయన అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లో చేరారు దానం నాగేందర్. టికెట్ హామీతోనే ఆయన ఆ పార్టీలో చేరారు. తీరా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అయన పేరు లేకపోవడంతో ఆయన వర్గంలో ఆందోళన నెలకొంది. అలాగే వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ స్థానాన్ని కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. ఆమె ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గంలో వేలు పెట్టడమే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ టిక్కెట్నూ కూడా ప్రకటించలేదు. అక్కడ సుధీర్ రెడ్డికి కాకుండా కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినబడుతోంది. ఇక చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు కూడా టికెట్ పెండింగ్లో పెట్టారు కేసీఆర్. ఈ ఉదయాన్నే చొప్పదండి చెందిన టీఆరెస్ నేతలు కొందరు అధిష్ఠానాన్ని కలిసి ఆమెపై ఫిర్యాదు చేయడంతోనే సీటు పెండింగులో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గమైన హుజూర్ నగర్, అయన భార్య పద్మావతి నియోజకవర్గం కోదాడ, అంబర్పేట, మల్కాజిగిరి, వికారాబాద్ స్థానాలను కూడా కేసీఆర్ పెండింగ్లో ఉంచారు.