దయ్యాల్లేవు, భూతాల్లేవు, అదంతా ఒట్టి రూమర్ అని నిరూపించడానికి ఓ జంట తమ పెళ్ళిరోజును శ్మశానంలో జరుపుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే..కర్నాటకలోని కల్బుర్గి జిల్లాలో మూఢ నమ్మకాలను దూరం చేసేందుకు ఆ దంపతులు వినూత్న ప్రయోగం చేశారు. వీరు తమ 18 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను శ్మశానంలో చేసుకున్నారు. కల్బుర్గిలోని శివారు గ్రామమైన నందీకుర్కు చెందిన పవన్ కుమార్, అనితల విచిత్ర వివాహ వార్షికోత్సవానికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వేడుకలకు గుర్తుగా వారు మొక్కలను కూడా నాటారు. అనిత జిల్లా పంచాయతీ అధ్యక్షులిగా పనిచేశారు. ఆమె భర్త వవన్ కుమార్ సామాజిక కార్యకర్త. వీరు ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే వీరు శ్మశానాన్ని శుభ్రపరిచి అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ‘మొదట్లో వేడుకలకు వచ్చేందుకు కొంతమంది నిరాకరించగా, వారికి అవగాహన కల్పించడంతో హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం కూడా చేశారని’ పేర్కొన్నారు.