2007 మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుపై ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం తీర్పు వెలువడిన తర్వాత వరుస ట్వీట్లు చేసిన ఆయన.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), మోదీ సర్కారులపై నిప్పులుచెరిగారు.
‘‘మక్కా మసీదు పేలుళ్లలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏలు వ్యవహరించాయి. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినా, ఎన్ఐఏ సవాలు చేయలేదు. కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అది రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉంది’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.