కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సీటుకు పొత్తుల్లో భాగంగా ఎసరొచ్చింది. ఇంతకాలం కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న జనగాం సీటును టీజేఎస్కి కట్టబెట్టింది. దీంతో ఆ పార్టీ తరఫున కోదండరాం జనగాం బరిలో దిగనున్నారు. బీసీ నేతగా, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తప్పించి కోదండరాంకు బలవంతంగా అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన జనగాం టికెట్పై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్యను తప్పించి కూటమి తరఫున టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు జనగాం సీటు కట్టబెట్టారు.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా మిర్యాలగూడ సీటును తన తనయుడు రఘువీర్రెడ్డికి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి జనగాం సీటును టీజేఎస్కు బలవంతంగా కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. అంతకు ముందే జనగాంలో ఇదే విషయంపై జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై పొన్నాల లక్ష్మయ్య కూడా స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొందరు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ కుట్రకు తెరతీస్తున్నారని ఆయన విమర్శించారు. పాపం ఇదంతా చూస్తుంటే ఇంతకాలం పార్టీకి విస్తృత సేవలందించిన పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం జరిగిందనే అర్ధమవుతుంది. మరి తనకు సీటు లేకుండా చేసిన కాంగ్రెస్ అధిష్టానం తీరుపై పొన్నాల ఎలా స్పందిస్తారో చూడాలి.