ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టింది. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహం అన్న దశలను పూర్తి చేసుకొని నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
సమాచార వ్యవస్థకు కీలకమైన జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ ద్వారా రోదసిలోకి విజయవంతగా పంపారు. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. భారత్ నుంచి ప్రయోగించిన వాటిలో జీశాట్-29 అత్యంత బరువైనది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ 16.43 నిమిషాలలో భూమికి 207కిలో మీటర్ల ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని విజయవంతంగా వదిలిపెట్టింది.
మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమాచార అవసరాలను జీ శాట్-29 తీర్చనుంది. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.