విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న సాధ్వి ప్రాచి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలకు చురకలంటించారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి పెళ్లి కావాలని తాను కోరుకున్నానని అన్నారు.‘బాబా గోరఖ్నాథ్ ఆశీస్సుల కోసం నేను క్రమం తప్పకుండా ఇక్కడకు వస్తుంటాను. కానీ, ఈ సారి మాత్రం ఓ ప్రత్యేకమైన కోరిక కోరాలని వచ్చాను.. వారు (కాంగ్రెస్ నేతలు) వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజార్టీని సాధించలేకపోతే, కనీసం రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నాను’ అని సాధ్వి అన్నారు. గతంలోనూ పలుసార్లు ఆమె ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కాగా సాధ్వీ ప్రాచి చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల సర్వసాధారణంగా మారిందని, ఇలా మాట్లాడే వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయి ఏమిటో తెలియజేస్తోంది’’ అని అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు.