11న హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. 15 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు , రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్ను ఏర్పాటు చేశామని దాన కిషోర్ వెల్లడించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలివిడత శిక్షణ పూర్తి అయిందని, 10న రెండవ విడత శిక్షణ ఉంటుందని చెప్పారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారన్నారు. మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించబోమని దాన కిషోర్ స్పష్టం చేశారు.
అయితే, మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని దాన కిషోర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, భారత ఎన్నికల సంఘం పర్యవేక్షించేందుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారి దానకిషోర్ పేర్కొన్నారు.
నగర పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లోని 15 చోట్ల స్ట్రాంగ్ రూమ్స్/కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంగళవారం కౌంటింగ్ సైతం ఇక్కడే జరుగనుంది. పోలింగ్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్న పోలీసులు స్ట్రాంగ్రూమ్స్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మూడంచెల భద్రత కల్పించడంతో పాటు కొన్ని అదనపు చర్యలు తీసుకుంటున్నారు.