ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో విషాదం నెలకొన్నది. ఆరంతస్తుల భవనం అర్థరాత్రి కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై పడింది. దాంతో ఈ రెండు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింది నుంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎప్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
గ్రేటర్ నొయిడాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మొదట నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలి పక్కనే నాలుగంతస్తుల బిల్డింగ్పై పడింది. నాల్గంతస్తుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
భవనాలు కుప్పకూలినట్లు సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి శిధిలాలు తొలగింపచేశారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.