తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతలకు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతోనే ఆయనీ సూచన చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘‘నాకు ఇప్పటికే రెండుసార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇటువంటి సమయంలో నేను సీఎం కావడం అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయనీ సూచన చేసి ఉండొచ్చు’’ అని వివరించారు. విధాన సభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్టు తెలిసిందని, ఇటువంటి సమయంలో ప్రభుత్వాన్ని నడపగలనా? అన్న అనుమానం కలుగుతోందని కుమారస్వామి అన్నారు. తన ఆందోళనను తండ్రితో కూడా పంచుకున్నట్టు సీఎం తెలిపారు.