జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా రెండో రోజు కరీంనగర్లో పర్యటించారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ బసచేసిన హోటల్ వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో ఈ ఉదయం అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా హోటల్ అద్దాలు పగిలాయి. సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్వేతా హోటల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ శ్వేతా హోటలకు వస్తాడని ముందే తెలుసుకున్న అభిమానులు.. తమ అభిమాన నటుడిని కలిసేందుకు అక్కడ పడిగాపులు కాశారు. తీరా పవన్ అక్కడికి వచ్చాక ముఖ్య నేతలతో భేటీ అయి వెనుదిరిగారు. హోటల్ నుంచి పవన్ బయటకు వెళ్లే సమయంలో అభిమానులు భారీగా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడడంతో బౌన్సర్లకు, అభిమానులకు మధ్య తోపులాటలో హోటల్ ద్వారం వద్ద ఉన్న గ్లాస్ డోర్ పగిలిపోయింది. గ్లాస్ డోర్ను బలంగా తోయడంతో గాజు ముక్కలు ఎగిరి అక్కడున్న వారికి గుచ్చుకున్నాయి. ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడ్డారు.
‘‘పవన్ కల్యాణ్ అంటే మాకు పిచ్చి.. ప్రాణం. పవన్ వస్తున్నాడని తెలిసి రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మా అభిమాన నటుడు మాతో మాట్లాడతాడని ఎంతో ఆశతో ఎదురు చూశాం. తినడానికి తిండి కూడా లేకుండా ఇక్కడే పడి ఉన్నాం. అయినా మాలాంటి అభిమానులతోనే పవన్ మాట్లడకపోతే ఎలా? వీఐపీలతోనే మాట్లాడడం అవసరమా? పవన్ను చూడడానికి వచ్చినందుకు మాకు మంచి గుణపాఠం చెప్పారు.’’ అంటూ రక్తం కారుతున్న గాయాలను చూపిస్తూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.