తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం సిద్ధమైంది. 4 రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు నిర్వహించేందుకు ఈసీ సిద్ధం అవుతోంది. శుక్రవారం భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఉమేశ్ సిన్హా కమిటీ రిపోర్ట్ను పరిశీలించిన ఈసీ తెలంగాణకు సీఈసీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించే తేదీలను ఖరారు చేయనుంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. శుక్రవారం ఈసీ కార్యలయంలో సీఈసీ రావత్తో పాటు ఇద్దరు సీనియర్ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల సన్నద్దతపై ఏర్పాటైన ఉమేష్ సిన్హా కమిటీ తన రిపోర్టును అందజేసింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగానే ఉన్నాయని, ముందస్తు ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని నివేదికలో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించామని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని కమిషన్ అభిప్రాయపడింది.
ఎన్నికల విషయంలో వివిధ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను ఉమేశ్ సిన్హా రిపోర్ట్ తోసిపుచ్చింది. అయితే ఓటరు జాబితాపై కాంగ్రెస్ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు నివేదికలో పొందుపర్చింది. అలాగే వీవీ పాట్లు, ఈవీఎంలు కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్లో పేర్కొంది.
మరోవైపు వారం పది రోజుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. ఈసీ పర్యటన తర్వాతే ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల్లో పరిస్థితిని రావత్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ పర్యటన పూర్తి చేసిన రావత్ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. వచ్చే నెలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.