ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా కల్పించాలని సీఈఓ రజత్ కుమార్ సీఎస్ను ఆదేశించారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన తెలంగాణ వాసులు ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు పరుగులు పెడుతున్నారు. చాలామంది ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్తుండటంతో టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై గల యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద శుక్రవారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టోల్ప్లాజాలు ఎత్తివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటేసేవారు సొంత ఊళ్లకు వెళ్తుండగా ఇబ్బంది పడొద్దని ఈసీ నిర్ణయం తీసుకుంది.