చీలిక దిశగా మహాకూటమి

Update: 2018-11-10 05:10 GMT

సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ తమకు 3 సీట్లు ఇవ్వడంపై సీపీఐ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లిలో పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది. టీజేఎస్‌ కూడా సీపీఐ బాటలోనే పయనిస్తోంది. తమకు మరిన్ని సీట్లు కావాలంటోంది. ఇదంతా చూస్తుంటే మహాకూటమిలో చీలిక ఖాయంగానే కనిపిస్తోంది. 

కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్‌, మునుగోడు, బెల్లంపల్లి స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాకూటమిలో భాగమైన సీపీఐ 9 సీట్లు డమాండ్‌ చేస్తుండగా కాంగ్రెస్‌ పెద్దలు 3 సీట్లు మాత్రమే ఇస్తాననడం దారుణమని పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, గోదా శ్రీరాములు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే ప్రధాన లక్ష్యంతోనే సీపీఐ పనిచేస్తుందని ఉద్ఘాటించారు.   

ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపులు చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్‌ఎస్‌ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని నేతలు ఆకాక్షించారు. ఉమ్మడి రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తి పరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించడం సరికాదని హితవుపలికారు.

Similar News