సమ్మెలు వరుస సెలవులతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు ఐదు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అలాగే 26న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కూడా సమ్మె చేస్తున్నాయి. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకులు మూతపడతాయి. అలాగే 22న నాలుగో శనివారం, 23న ఆదివారం, 25వ తేదీన క్రిస్మస్ సెలవులు వచ్చాయి. మధ్యలో 24న మాత్రం.. అంటే సోమవారం నాడే ప్రభుత్వ బ్యాంకులు పని చేస్తాయి. అయితే, ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉండటంతో బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం ఉండదు. దీంతో ఆరు రోజుల పాటు బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తోంది. వరుస సెలవులతో ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.