కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోన్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎటూ తేల్చలేకపోయింది. దాదాపు 20 అసెంబ్లీ స్ధానాల విషయంలో అభ్యర్ధుల పేర్లను సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రతిపాదిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ సోనియా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సోనియాతో భేటీ తర్వాత రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించడంతో ఈ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయం కుదరని సీట్లపై చర్చలు కొనసాగిస్తోంది. దేవరకొండ, తుంగతుర్తి, ములుగు సహా దాదాపు 20 అసెంబ్లీ స్ధానాల విషయంలో అభ్యర్ధుల పేర్లను సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రతిపాదిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. పలు నియోజకవర్గాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి-జానారెడ్డిలు భిన్నమైన పేర్లను ప్రతిపాదిస్తున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరికి మించి అభ్యర్ధులు తెరపైకి వస్తుండటంతో సుదీర్ఘ కసరత్తు సాగుతోంది. ఎల్లారెడ్డి నుంచి పైలా కృష్ణారెడ్డి, సుభాష్రెడ్డి, నల్లమడుగు సురేందర్ పేర్లు పరిశీలిస్తుండగా, బాల్కొండ నుంచి అనిల్, రాజారామ్ యాదవ్లను ప్రతిపాదించారు. నిజామాబాద్ రూరల్ రేస్ నుంచి వెంకటేశ్వరరెడ్డి, భూపతి రెడ్డి అభ్యర్ధిత్వాలకు పోటీపడుతుండగా, నిజామాబాద్ అర్బన్ బరి నుంచి మహేష్ గౌడ్, అరికెల నర్సారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.ఇక మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు, అరవింద్ రెడ్డిలు అభ్యర్ధిత్వాల్లో ఒకరిని తుది జాబితాలో చేర్చేందుకు కసరత్తు సాగుతోంది. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, ఊకె అబ్బయ్య, దేవరకొండ నుంచి బిల్యానాయక్, జగన్ అభ్యర్ధిత్వాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. మరి తుది జాబితాలో వీరిలో ఎవరెవరికి టిక్కెట్టు ఖరారు చేస్తారో చూడాలి.