తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కి చేరుకుంటోంది. నెలరోజులుగా ముమ్మరంగా సాగుతోన్న ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దాంతో చివరి రెండు మూడ్రోజుల్లో మెరుపులు మెరిపించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం(డిసెంబరు 3న) హైదరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరవుతారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం(2న) భూపాలపల్లి, ముథోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బుధవారం(5న) కరీంనగర్, వరంగల్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉప్పల్, కొల్లాపూర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ప్రచారం చేస్తారని తెలిపారు.