షాపింగ్ ప్రపంచం మారుతోంది ఇప్పుడు ఏది కొనాలన్నా ఆన్ లైన్ లో దొరికేస్తుంది ఇంటికి పనికొచ్చేవి వంటికి పనికొచ్చేవి ఏదైనాసరే ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసేస్తున్నారు. అయితే ఓ యువతి మాత్రం ఆన్ లైన్లో ఓ విషపూరితమైన పామును ఆర్డర్ చేసి అదే పాము కాటుకు బలైంది. ఇప్పుడంతా ఆన్లైనే గుండు సూది నుంచి ఛార్టెట్ ఫ్లైట్ వరకు ఏదైనాసరే ఆన్లైన్లో కొనెయ్యవచ్చు. పిల్లలు, పెద్దలు, మహిళలు వృద్ధులనే తేడా లేకుండా ఎవరికి ఏం కావాలన్నా ఆన్ లైన్ లో దొరికేస్తుంది.
అయితే చైనాలో ఓ యువతి విచిత్రమైన ఆర్డర్ ఇచ్చింది. జువాన్ జువాన్ అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఓ పామును కొనుగోలు చేసింది. సంప్రదాయ వైన్ తయారు చేయడం కోసం ఆమె దీన్ని ఆర్డర్ చేసింది. గుహాంగ్డాంగ్ ప్రాంతంలో అత్యంత విషపూరిత పాములు ఎక్కువగా ఉంటాయని తెలుసుకుని అక్కడి నుంచి ఈ పామును తెప్పించింది. స్థానిక కొరియర్ సంస్థ ఓ పెట్టెలో పెట్టి ఆమెకు దీన్ని డెలివరీ చేసింది.
పార్శిల్ అందుకున్న యువతి ఆ పెట్టెను తెరిచింది. పెట్టెను తెరుస్తూనే అందులో ఉన్న విషపూరిత పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. బాక్స్ నుంచి తప్పించుకోబోతున్న పామును పట్టుకోవడంతో ఆ పాము కాట వేసింది. అత్యంత విషపూరితమైన పాము కావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.
వాస్తవానికి వన్యప్రాణులను ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేయడం చైనాలో నిషిద్ధం. కానీ కొన్ని పోర్టళ్లు అక్రమంగా వీటిని వినియోగదారులకు చేరవేస్తున్నాయి. అయితే, బాక్సులో ఏముందో తమకు తెలియదని డెలివరీ సంస్థ చెబుతోంది. మొత్తానికి ఆ యువతి తన చావును తానే కొరియర్లో తెప్పించుకున్నట్టుగా ఈ ఘటన కనిపిస్తోంది.