ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు , తెలంగాణ సీఎం కేసీఆర్ షాకిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాదయాత్రలో ఉన్న జగన్ ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఆ అవిశ్వాస తీర్మానం సోమవారం పార్లమెంట్ లో చర్చకు రానున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహంపై కేసీఆర్ - చంద్రబాబు నీళ్లు చల్లే ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పార్లమెంట్ లో తాము పెట్టే అవిశ్వాస తీర్మానంపై మద్దతు పలకాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే అందుకు టీఆర్ఎస్- టీడీపీ లు సిద్ధంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ నోకాన్ఫిడెన్స్ మోషన్ కు తాము మద్దతు ఇవ్వలేమని చంద్రబాబు - కేసీఆర్ లు తమ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం.
తాము మద్దతు ఇచ్చినా వైసీపీ అవిశ్వాస తీర్మానం వల్ల ఏపీకి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువేనని ఆ పార్టీ అధినేతల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భారీ ఎత్తున బ్యాంకుల్లో కుంభకోణాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కుంభకోణాలపై పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయని, ఆ సమయంలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వైసీపీ కి మద్దతు ఇస్తే టీడీపీ ప్రాభవం దెబ్బతినే అవకాశం ఉంది.
ఇక తమ రాష్ట్రానికి కావాల్సిన నిధులు- సంక్షేమ పథకాల గురించి పార్లమెంట్ లో చర్చిస్తాం. అంతేకానీ వైసీపీకి అండగా నిలిచే ప్రయత్నం చేయలేమని కేసీఆర్ తమ పార్టీ నేతలతో చెప్పినట్లు టాక్. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదాకోసం టీఆర్ఎస్ ఎటూ మద్దతు ఇస్తుంది. ఇక నో కాన్ఫిడెన్స్ మోషన్ కు మద్దతు ఇస్తే ..తెలంగాణ రాష్ట్రం తరుపు డిమాండ్లపై చర్చించే అవకాశం ఉండదని కేసీఆర్ వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు పొలిటికల్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ అవిశ్వాస తీర్మానం సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకుంటే ..అవిశ్వాస తీర్మానాన్ని ఒక్క ఎంపీ అయినా ప్రవేశపెట్టొచ్చు. అయితే తర్వాత దానికి 50 మంది ఎంపీల మద్దతు పలకాలి...అప్పుడే దానిని పరిగణలోకి తీసుకుంటారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే...మొదట లోక్సభలో రూల్ 198 ప్రకారం లిఖిత పూర్వక నోటీసు ఇవ్వాలి. తర్వాత దానిని స్పీకర్ సభలో చదివి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో తెలుసుకుంటారు. 50 మందికి పైగా సభ్యులు తీర్మానానికి మద్దతు పలికితే ఒక రోజును తీర్మానంపై చర్చకు నిర్ణయిస్తారు. తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఒకవేళ ఓటింగ్లో అవిశ్వాన తీర్మానానికి ఎక్కువ ఓట్లు వస్తే... కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. ఎందుకంటే..లోక్సభ ఉన్న 543 స్థానాలకు గానూ అధికార పార్టీకి 272 మంది బలముంటే సరిపోతుంది. ఎన్డీయేలోని అతిపెద్ద పార్టీ బీజేపీకి 272 మంది సభ్యుల బలంతో పాటు స్పీకర్ ఉన్నారు. మొత్తంగా ఎన్డీయే కూటమికి 330 మంది ఎంపీలున్నారు. పైగా అన్నాడీఎంకే..పాటు మరి కొన్ని పక్షాలు బయటనుంచి మద్దతు ఇస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 25 మంది సభ్యులుంటే...అందులో ఇద్దరు బీజేపీ ఎంపీలు. మిగతా 23 మందిలో 15 మంది టీడీపీ 8 మంది వైసీపీ సభ్యులు. మరి వైసీపీ కానీ , టీడీపీ కానీ , లోక్సభలో 48 మంది ఎంపీలున్న కాంగ్రెస్ కానీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎన్ని పార్టీలు మద్దతిస్తాయనేదే ఆసక్తికరంగా మారింది.