బావ వేధింపులకు భరించలేక మరదలు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ యల్లయ్య తెలిపిన వివరాలు ప్రకారం...కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు సుష్మకు అదే మండలం సింగరాయపాలెంకు చెందిన మోకపోతుల అశోక్తో వివాహం జరిపారు. ఇతను కొత్తగూడెం క్రైంబ్రాంచ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గతేడాదికాలంగా అశోక్ తనను ప్రేమించాలని మరదలు లింగాల అనూష (21)ను వేధిస్తున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో గతంలో పెద్దమనుషులతో చెప్పించారు.
అయినా కూడా ఆమెను వదిలిపెట్టలేదు. ఆదివారం ఉదయం చిన్నగోపతి వచ్చిన అశోక్ అనూషకు ఇవ్వమని ఓ నోటీస్ను పక్కింటి అమ్మాయితో పంపించాడు. అందులో ఓ వ్యక్తి అనూషకు వ్యతిరేకంగా కేసు పెట్టినట్లు, కోర్టుకు హాజరుకాక పోతే అరెస్టు చేస్తారని ఉంది. దీంతో భయపడిన ఆ యువతి విషయాన్ని తల్లికి చెప్పి తండ్రిని పిలుచుకురమ్మని బయటికి పంపింది. బయటకు వెళ్లిన తల్లి తన భర్తను తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకొన్న అనూష కనిపించింది. అల్లుడి వేధింపుల కారణంగానే తన చిన్నకూతురు ఆత్మహత్య చేసుకున్నదని భిక్షమయ్య పొలీస్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ యల్లయ్య సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. భిక్షమయ్య ఫిర్యాదు మేరకు అశోక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం అశోక్ పరారీలో ఉన్నాడన్నారు.