దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా లెత్పోరలో సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడులకు పాల్పడింది తామేనంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ తాంత్రేను గత మంగళవారంనాడు పుల్వామా జిల్లా సంబూర గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ ప్రతీకారదాడులు చోటుచేసుకున్నాయి. అయితే భారత జవాన్ల మరణంపై బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ దారుణ వ్యాఖ్యలు చేశారు. జవాన్లు శత్రువలతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే’ అన్నారు. దీంతో నేపాల్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలతో కంగుతిన్న బీజేపీ ఎంపీ మాటమార్చారు. జవాన్లు అమరవీరులు. వారిగురించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు అలా అనిపిస్తే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.