రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారానికి వెళ్లిన ఓ భాజపా నేతకు చేదు అనుభవం ఎదురైంది. చెప్పుల దండ వేసి అవమానించారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో థామ్నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే బీజేపీ నేత ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఓట్లు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అంతే తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో ఇక తప్పదని చెప్పుల దండ వేయించుకున్నాడు. అనంతరం ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను ఇలా చేశానని అన్నారు. ‘నా వల్ల అతనికి ఏదో అసంతృప్తి కలిగి ఉంటుంది.. అందుకే ఇలా ప్రవర్తించి ఉంటారు. నేను వాళ్ల బిడ్డ లాంటి వాడిని. అన్ని విషయాలు కూర్చుని చర్చిద్దా’మని దినేశ్ ఆ ఘటన అనంతరం అన్నారు.