కవిత్వమంటే వాజ్ పేయికి పంచప్రాణాలు. రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వ సాధనను విడిచిపెట్టలేదాయన. అయితే, వాజ్ పేయి సాహిత్యంతో పాటు సినీ ప్రియుడు కూడా. ముఖ్యంగా ఆయన బాలీవుడ్ డ్రీమ్ గాల్ హేమమాలిని అభిమాని. వాజ్పేయి అనగానే చాలామందికి గొప్ప రాజకీయవేత్తగా, మాజీ ప్రధానిగా, కవిగా మాత్రమే తెలుసు. అయితే, ఆయన సినిమా ప్రియుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. బాలీవుడ్ నటి హేమ మాలినికి ఆయన గొప్ప ఫ్యాన్. ఆమె నటించిన ‘సీత ఔర్ గీత’ సినిమాను వాజ్పేయి ఏకంగా 25 సార్లు చూశారట.
ఓసారి హేమ మాలిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మొదటిసారి వాజ్పేయిని కలిసినప్పుడు, ఆయన తనతో మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. వాజ్పేయి తనకు వీరాభిమాని అని ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని హేమ మాలిని తెలిపారు. వాజ్పేయి కవితలు ఆయనకు వేలాది మంది అభిమానును తెచ్చిపెట్టాయి. కొన్ని కవితలను బాలీవుడ్ దిగ్గజాలు పాడి, అందరూ ఆస్వాదించేలా చేశారు. సుప్రసిద్ధ గాయనీమణి లతా మంగేష్కర్, గాయకుడు జగ్జీత్ సింగ్ వాజ్పేయి కవితలను ఆలపించారు.