అటల్ బిహారీ వాజ్ పేయి పరిపాలన దక్షుడే కాదు మంచి భోజనప్రియుడిగానూ పేరుంది. స్వీట్లు, రొయ్యలు అంటే ఎంతో ఇష్టంగా తినేవారు. ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానికంగా లభించే ఆహార పదార్దాలను పట్టుబట్టి తినేవారు. ముఖ్యంగా మన హైదరాబాదీ బిర్యానీ అన్నా, నెల్లూరు నుంచి వెంకయ్య నాయుడు తీసుకెళ్లే రొయ్యలన్నా వాజ్ పేయి ఇష్టంగా తినేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. అటల్జీ పాలనపై ఎంత ఆసక్తి చూపే వారో ఆయన తినే ఆహరంలోనూ అంతే ఆసక్తి కనబరిచేవారు. స్వీట్లు రొయ్యలు అంటే వాజ్ పాయ్ ఎంతో ఇష్టపడే వారు. ప్రధానిగా ఉన్న సమయంలో అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా ఫుడ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి స్వయంగా ఆర్డర్ ఇచ్చుకునేవారు.
ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ లభించే ఆహారపదార్దాలను తినేందుకు మొగ్గుచూపేవారు. కోల్ కతాలో పుచ్ కాస్, హైదరాబాద్ లో బిర్యానీ..హలీం.. లక్నోలో గలోటి కబాబ్స్ ఆయన తినేవారు. ఛాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసలా టీ కాంబినేషన్ అంటే భలే ఇష్టపడేవారు. లక్నో నుంచి తన స్నేహితులు ఎవరైనా వస్తుంటే కబాబ్స్ తెప్పించుకునే వారు. అంతెందుకు నేటి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు స్వయంగా వాజ్ పేయి అమితంగా ఇష్టపడే రొయ్యలను నెల్లూరు నుంచి తీసుకువచ్చేవారు. కనీసం వారంలో రెండు రోజులైనా ఆయన మెనూలో రొయ్యలు ఉండేవట. అంతగా ఆయనకు రొయ్యలంటే ఇష్టం. ఇక కేంద్రమంత్రి విజయ్ గోయెల్ బెడ్నీ ఆలూ చాట్ తీసుకువస్తుండేవారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకున్నారు.
కేబినెట్ సమావేశాల సమయంలో ఏర్పాటు చేసే లంచ్ లో వాజ్ పాయి ఉప్పుతో దట్టించిన వేరుశనగ కాయలు తినేవారు. ప్లేట్లో ఖాళీఅయినా కొద్దీ మళ్లీ మల్లీ తీసుకురమ్మంటుండేవారు. ఎన్నో సార్లు తనతో కలిసి ఉండే అధికారులు, జర్నలిస్టు మిత్రులకు మాంసాహారం, స్వీట్స్ లో ఏదో ఒకటి స్వయంగా ఒండి వడ్డించేవారు అటల్ జీ.