మమతా బెనర్జీ ప్రభుత్వం తనను బెదిరించలేదని, తాను కోల్కతా వెళ్లే తీరుతానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఈ నెల 11న కోల్కతాలో ర్యాలీ నిర్వహించాలని అమిత్ షా భావించారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు.