కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బిజెపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పడు కాంగ్రెస్ కు తిరుగులేని ఆయుధంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిజెపిపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో అమిత్ షా ఈరోజు కర్ణాటకలోని దావణగెరేలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు. ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యాడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. అదే సమయంలో అమిత్ షా పక్కనే యాడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యాడ్యూరప్ప కంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యాడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.