పాకిస్తాన్కు మరోసారి బుద్ధి చెప్పిన భారత్..ఏడుగురు పాక్ సైనికుల హతం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ మరోసారి బుద్ధిచెప్పింది. యూరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి ప్రతీకారంగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి నియంత్రణ రేఖ వెంబడి పాక్ తీవ్రవాద స్థావరాలను ధ్వంసంచేసిన భారత సైన్యం మరోసారి తమ సత్తా ఏంటో పాక్ సైన్యానికి రుచి చూపించింది. రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాను మరణించడంతో ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు మరణించారు.
రాజౌరి సెక్టార్లో కాల్పులకు తెగబడి భారత జవానును హతమార్చిన పాకిస్తాన్ చర్యకు ప్రతీకారంగా ఫూంఛ్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్స్పై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ కాల్పుల్లో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు హతమవగా, మరో నలుగురు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ కౌంటర్ అటాక్తో పాకిస్తాన్కు భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని తాము కన్నెర్ర చేస్తే తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చింది.
అయితే ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను పాకిస్తాన్ ఖండిస్తోంది. తమ సైనికులు నలుగురే మరణించారని, మిగతా ముగ్గురూ భారత జవాన్లేనని చెబుతోంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం కాల్పులు జరిపిన మాట వాస్తవమేనంటున్న పాకిస్తాన్ చనిపోయిన వారిలో నలుగురే తమ సైనికులంటోంది. అంతేకాదు ఇండియన్ ఆర్మీ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని చెప్పుకుంటోంది. అయితే ఈ అటాక్ భారత్కు పెద్ద విజయమని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది.