ఒడిశా ధేంకానాల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో ఏడు ఏనుగులు మృతిచెందాయి. స్థానిక కమలాంగా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ సమీపంలో గజరాజులు మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు అటవీశాఖ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్ధలానికి చేరుకున్న అటవీశాఖాధికారులు ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టం చేయించారు.
రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన హైవోల్టేజ్ వైర్లు తగలడంతో ఏనుగులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలను ఉంచడం వల్ల అన్యాయంగా ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయని అంటున్నారు. మరణించిన ఏనుగులను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుంపులో ఉన్న మరో ఆరు ఏనుగులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి.