తెలంగాణ వ్యాప్తంగా న్యూఇయర్ సంబురాలు అంబరాన్నంటాయి. ఓ వైపు కొత్తసంవత్సరం..మరోవైపు ప్రభుత్వం వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటలపాటు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా ప్రారంభమైన శుభవేళ. వెరసి లక్షల రైతు కుటుంబాలు ఆనందంలో మునిగితేలాయి. 2018 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిసంబురాలు చేసుకొంటున్నమంచి తరుణం.. సరిగ్గా కొత్త ఏడాది ప్రవేశించడానికి ఒక్క నిమిషానికి విద్యుత్ అధికారులు రాష్ట్రంలో 23లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరంట్ సరఫరాను విద్యుత్ సంస్థలు సగర్వంగా ప్రారంభించాయి.
ఆదివారం పోతాయిపల్లిలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును మోటార్ ఆన్ చేసి సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి రైతుల సమక్షంలో 24గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించి.. వారు సంబురాల్లో పాలుపంచుకొన్నారు. విద్యుత్ అధికారులు రాష్ట్రంలో అన్నీ జిల్లాలకు నిరంతర విద్యుత్ను పరిశీలిస్తూ.. సిబ్బందికి అవసరమైన సూచనలు అందిస్తూ.. అందరినీ ఉత్సాహపరుస్తూ.. తెల్లవారుజామువరకు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముచ్చటించారు. ఇక రైతులు ఉదయం వేళలో మోటర్లను ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో రానున్న డిమాండ్ను అంచనా వేస్తూ.. తగిన చర్యలను ఉన్నతాధికారులు చేపట్టారు. వ్యవసాయానికి నిరంతర సరఫరా కోసం ప్రత్యేకంగా 7500 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులో ఉంచారు. ఈ శుభతరుణంలో సీఎం కేసీఆర్ రాష్ట్రప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడుపాలని భగవంతుడిని ప్రార్థించారు.