ఆలిండియా బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుతో దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. మెరుగైన వేతనాల పెంపు డిమాండ్తో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగడంతో ప్రభుత్వ , ప్రయివేటు బ్యాంకులు మూతబడ్డాయి. ఉద్యోగుల సమ్మెతో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. వేతన సవరణపై చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మె అనివార్యమైనట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రకటించింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లోని9 అసోసియేషన్స్కి చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ నెల 5న జరిగిన సమావేశంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రెండు శాతం వేతనాల పెంపును ప్రతిపాదిండాన్ని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు తీవ్రంగా తప్పుబట్టాయి. వ్యాపార పరిణామం పెరిగి .. నిర్వహణ లాభాలు మెరుగుపడుతున్నా వేతనాల పెంపును రెండు శాతానికి పరిమితం చేయడంపై తమ అసంతృప్తిని తెలియజేసింది. దీనిపై స్పందించిన ఐబీఏ మరోసారి చర్చల జరిపి సమస్య పరిష్కరిద్దామంటూ తాత్కాలికంగా పక్కన బెట్టారు. అప్పటి నుంచి ఎలాంటి చర్చలకు ఆహ్వానించకపోవడంతో 25 రోజుల క్రిత సమ్మె నోటిసు అందించారు.
దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి స్ధాయిలో స్తంభించాయి. బ్రాంచీల పరిధిలో విత్డ్రాయల్, డిపాజిట్ లావాదేవీలు నిలిచాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యాంకింగ్ రంగంలో 75 శాతంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోవడంతో సామాన్యులు, నిరక్షరాస్యులు, జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేవలం బ్యాకింగ్ సెక్టార్లో ఉద్యోగులు మాత్రమే పని చేయడం లేదని ... ఏటీఎం, డిపాజిట్ మిషన్లు, ఆన్లైన్, మొబైల్ లావాదేవీలు యథాతథంగానే కొనసాగుతున్నట్టు బ్యాంకుల యజమాన్యలు ప్రకటించాయి. ఏటీఎంలో థర్డ్ పార్టీ ద్వారా ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నామని ... శుక్రవారం నుంచి బ్యాంకింగ్ సేవలు నార్మల్గానే కొనసాగుతాయని చెబుతున్నారు.