సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వినాయకనగర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదంటూ ఓ విద్యార్థిని గొంతు కోసేశాడు. టెన్త్ విద్యార్థిని నిఖితను ప్రేమించాలంటూ అరవింద్ అనే యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. అందుకు నిఖిత నిరాకరించడంతో ఉన్మాదిలా మారి ఆమెను హతమార్చాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రేమ పేరుతో వేధిస్తూ తనకు దక్కదనే అక్కసుతో ఓ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పరిధిలోని వినాయక్ నగర్లో నివసించే గోరు నిఖిత శ్రీసాయి విద్యానికేతన్ పాఠశాలలో టెన్త్క్లాస్ చదువుతోంది. అదే కాలనీలో ఉండే అరవింద్ అలియాస్ సోను ప్రేమ పేరుతో గత రెండేళ్లుగా నిఖితను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నిఖిత పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగానే వెనుక నుంచి వచ్చి కత్తితో గొంతు కోశాడు.
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడివున్న నిఖితను స్థానికులు హుటాహుటీన కూకట్పల్లి రెమెడీ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఘటన జరగగానే యువకుడిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు అరవింద్ నిఖిత ఉండే ఎదురింటిలోనే ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేమోన్మాది దాడితో స్థానికంగా కలకలం రేగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిఖిత తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.