Aadhaar : యూఐడీఏఐ సరికొత్త రికార్డు.. 83 వేల స్కూళ్లలో ఒక కోటి మంది పిల్లల ఆధార్ అప్డేట్
యూఐడీఏఐ సరికొత్త రికార్డు.. 83 వేల స్కూళ్లలో ఒక కోటి మంది పిల్లల ఆధార్ అప్డేట్
Aadhaar : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఒక భారీ రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం చేపట్టిన ప్రత్యేక ఆధార్ అప్డేట్ డ్రైవ్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సుమారు 83,000 స్కూళ్లలో ఒక కోటి మందికి పైగా పిల్లల బయోమెట్రిక్ వివరాలను విజయవంతంగా అప్డేట్ చేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆధార్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఎందుకు ఈ అప్డేట్ తప్పనిసరి?
పిల్లలకు ఐదేళ్ల లోపు ఆధార్ కార్డు జారీ చేసేటప్పుడు కేవలం వారి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో మాత్రమే తీసుకుంటారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కంటిపాప వివరాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. అందుకే 5 ఏళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీనినే మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. ఈ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులు రాసే నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల దరఖాస్తు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మిషన్ మోడ్లో సెప్టెంబర్ 2025 నుంచి ప్రయాణం
విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ, సెప్టెంబర్ 2025లో ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన UDISE+ డేటాతో ఆధార్ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలకు అప్డేట్ అవసరమో సులభంగా గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా స్కూల్ ఆవరణల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి, తరగతులు విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండానే విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. కేవలం స్కూళ్లలోనే కాకుండా, ఆధార్ సేవా కేంద్రాల ద్వారా కూడా మరో 1.3 కోట్ల మంది అదనపు అప్డేట్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ నుంచి ఉచితం - రాష్ట్రాలకు పిలుపు
7 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ బయోమెట్రిక్ అప్డేట్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి ఒక ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తూ.. ఈ పథకాన్ని వంద శాతం విజయవంతం చేసేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్పులు నేరుగా లబ్ధిదారులకు అందాలంటే ఆధార్ అప్డేట్ అయి ఉండటం అత్యంత ముఖ్యం. స్కూళ్లలో కవర్ కాని విద్యార్థులు సమీపంలోని ఆధార్ సెంటర్లకు వెళ్లి కూడా తమ బయోమెట్రిక్ వివరాలను సరిచేసుకోవచ్చు.
భవిష్యత్తు ప్రణాళిక
దేశంలోని ప్రతి పాఠశాల కవర్ అయ్యే వరకు ఈ మిషన్ మోడ్ కార్యక్రమం కొనసాగుతుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా పిల్లల గుర్తింపు వివరాలు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం వల్ల పరీక్షల రిజిస్ట్రేషన్ల సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ సులభతరం అవుతుంది, తద్వారా అక్రమాలకు తావుండదు.