వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు జరుగుతాయని వైయస్ కుటుంబసభ్యులు వెల్లడించారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డిని కడసారి చూసేందుకు వివిధ జిల్లాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
ఇదిలావుంటే చిన్నాన్న హత్యపై సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారని అన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సౌమ్యుడిగా పేరు పొందిన మాజీ ఎంపీని ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యంత దారుణంగా చంపడం ఎక్కడ ఉండదని అన్నారు. ఈ సందర్బంగా వైసీపీ శ్రేణులను సంయమనం పాటించాలని జగన్ కోరారు.