ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శించుకున్నారు. వైఎస్ జగన్ వెంట ఆ పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, వరప్రసాద్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలు ఉన్నారు. ఇదిలావుంటే పాదయాత్ర ముగించుకున్న జగన్ తన సొంత జిల్లాపై దృష్టిసారించారు.
శుక్రవారం కడపకు చేరుకోనున్న జగన్ ఉదయం 9 గంటలకు కడపలోని అమీన్పీర్ దర్గాను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకొని అక్కడి సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకొని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. 13వ తారీకు వరకు జగన్ అక్కడే ఉంటారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గ నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు.