టికెట్ క్లారిటీ ఇవ్వలేదన్న కారణంతో వైసీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గౌరు దంపతులు క్లారిటీ ఇవ్వనప్పటికీ.. ప్రచారం మాత్రం ఉదృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఎమ్మెల్యే చరితారెడ్డి స్పందించారు. తన భర్త వెంకటరెడ్డి తాను ఈనెల 26న వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి లండన్ నుంచి రాగానే ఆయనతో మాట్లాడుతామన్నారు. ఆ తర్వాతనే ఏ పార్టీలో ఉండాలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. పార్టీ మారే ఆలోచన ఉంటే ప్రకటిస్తామని చెప్పారు.
కాగా మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి సతీమణి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలసి కాలినడకన శ్రీశైలం చేరుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే గౌరు చరిత త్వరలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె కోట్ల కుటుంబంతో కలసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.